http://apvarthalu.com/

Thursday, November 15, 2012

చంద్రబాబే ప్రభుత్వానికి అండ...షర్మిల

మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజల మనసుల్లో కొలువైవున్న ఆయనను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు చేరుకున్న షర్మిల అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బాబు తన హయాంలో గ్రామాలను స్మశానాలుగా మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఇంకొక అవకాశం ఇమ్మంటున్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించొచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments: