http://apvarthalu.com/

Monday, January 21, 2013

తెలంగాణ లేఖ వెనక నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడుకు మూడు రోజుల క్రితం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల హైదరాబాదు విషయమై ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని, ఆ ప్రతిపాదన పైన పార్టీలో చర్చించాలని బాబుకు సుధీష్ సూచించారు. అంబేద్కర్ సూచనను పరిగణలోకి తీసుకుంటే బావుంటుందన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంత సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా టిడిపి అభిప్రాయం చెప్పడంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి బాబును టార్గెట్‌గా చేసుకోవడం మానలేదు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు బాబు వల్లే సమైక్యవాదం మైనార్టీలో పడిందని మండిపడుతున్నారు. సీమాంధ్ర నేతలు బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. అవసరమైతే సమైక్యాంధ్ర నినాదంతో బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో సుధీష్ హైదరాబాద్ అంశాన్ని పార్టీలో తెరపైకి తీసుకు వచ్చారు. ఇది పార్టీలో మరింత చర్చకు దారి తీస్తోంది. సుధీష్ అభిప్రాయంతో పార్టీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారట. తెలంగాణకు అనుకూలంగా టిడిపి ఉందని ప్రజల్లోకి వెళుతున్న సమయంలో సుధీష్ ఇలా చేయడాన్ని తెలంగాణ టిడిపి నేతలు జీర్ణించుకోవడం లేదట. సుధీష్ లేఖ పైన తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన లేఖ వెనుక ట్విట్టర్ బాయ్ నారా లోకేష్ ఉన్నాడని ఆరోపించింది.

No comments: