http://apvarthalu.com/

Wednesday, October 31, 2012

తమిళనాడును వణికిస్తున్న నీలం తుపాను

నీలం తుపాను తమిళనాడును వణికిస్తోంది. నీలం మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నైకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు, కడలూరు మధ్య చెన్నైసమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది, తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు రెండు మీటర్లకు పైగా ఎగిసిపడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత తీరం వెంబడివున్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్‌ చేసింది. కాగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మహాబలిపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ, సైన్యం సిద్దంగా ఉంది. 

Tuesday, October 30, 2012

500 కిలోమీటర్ల దాటిన చంద్రబాబు పాదయాత్ర

వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 28వ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని ఆయన విమర్శించారు. ఇది పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్ర మంగళవారం 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది.

తుపాన్‌గా మారిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపాన్‌గా మారింది. దీనిని 'నీలం'గా చెన్నై వాతావరణ కేంద్రం ఖారారు చేసింది. తుపాన్ చెన్నైయ్‌కు ఆగ్నేయంగా500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సముద్రంలో అలల ఉధృతి పెరింగింది. గంటకు సుమారు 45 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తమిళనాడులో, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - నాగపట్నం మధ్య బుధవారం రాత్రి లోగా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్‌ నవంబరు 2 నాటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే 48 గంటలు సముద్రం కల్లోలంగా ఉంటుందని, మరోవైపు చెన్నై పోర్టులో అధికారులు ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగపట్నం, తూతుకూడి, కారేకల్ పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తీరం దిశగా వచ్చేసరికి గాలుల తీవ్రత పెరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తీరప్రాంత జిల్లాల్లో అలజడి మొదలైంది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో ఇప్పటికే మూడో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేయగా, తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో నాలుగోనెంబరు హెచ్చరిక ఎగరేశారు. తుఫానుగా మారే వాయుగుండం నెల్లూరు- నాగపట్నం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫానుషెల్టర్ కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి.

నవంబర్ 1ని బహిష్కరించండి

నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి, విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీన తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులను సూచించారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

Saturday, October 27, 2012

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

 గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

మహిళలతో షర్మిల రచ్చబండ

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Saturday, October 13, 2012

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె

 విద్యుత్ కోతలతో పెట్రోలు బంకుల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం పేర్కొన్నారు. చమురు కంపెనీలు కమీషన్ పెంచేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు శనివారం విలేకరులకు తెలిపారు. సమ్మె రోజుల్లో ఒక్క షిఫ్ట్‌లో మాత్రమే పెట్రోలు బంకుల్లో విక్రయాలుంటాయని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అవుట్‌లెట్‌లు పనిచేస్తాయని తెలిపారు. హైవేలోని అవుట్‌లెట్లలో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకే అమ్మకాలు ఉంటాయన్నారు.

రాయలసీమ ప్రజలారా మేల్కొనండి...బైరెడ్డి


పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు కలిసి రాయలసీమ హ క్కుల కోసం పోరాటం చేసి ప్రత్యేక సీమ సాధిద్దామని ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలుజిల్లా నుంచి కడప జిల్లాలో బైరెడ్డి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామ సరిహద్దులో మహిళా కూలీలు బైరెడ్డిని కలిసి జై రాయలసీమ అంటూ నినాదాలు చేస్తూ పూలమాల వేసి స్వాగతించారు. గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ అని, ఐక్యత ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాయలసీమ ఎన్నో సహజ వనరులకు నిలయమైన ప్రాంతం అన్నారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒడంబడిక నీరుగారిపోయిందన్నారు. కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టులను పోగొట్టుకున్నామన్నారు. పాదయాత్ర అనంతరం నవంబరు 10వ తేదీ అనంతపురంలో జరిగే బహిరంగసభలో రాయలసీమ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆనందంగా ఉంది...మహేశ్‌బాబు

ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉందని హీరో మహేశ్‌బాబు పేర్కొన్నారు. 14 రీల్స్‌ టీమ్‌ మొత్తానికి, దర్శకుడు శ్రీను వైట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2011 సంవత్సరానికిగానూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు ఎంపికయ్యారు. దూకుడు చిత్రానికిగానూ ఆయనకీ అవార్డు దక్కింది. 14 రీల్స్‌ పతాకంపై నిర్మించిన దూకుడు సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించారు.

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం


2011 సంవత్సరానికి గాను తెలుగు సినిమా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమ చిత్రంగా విరోధి ఎంపిక అయ్యాయి. ఉత్తమ నటుడుగా మహేష్‌బాబు, ఉత్తమ నటిగా నయన తార, ఉత్తమ దర్శకుడుగా శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్‌సెంట్ లవ్
ఉత్తమ సమగ్రత చిత్రం : జై భోలో తెలంగాణ
ఉత్తమ పాపులర్ చిత్రం : దూకుడు
ఉత్తమ తొలి బాలల చిత్రం : శిఖరం
ఉత్తమ ద్వితీయ బాలల చిత్రం : గంటల బడి
ఉత్తమ తొలిడాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం : మన బాధ్యత
ఉత్తమ నటుడు : మహేష్‌బాబు (దూకుడు)
ఉత్తమ నటి : నయనతార (శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు : శంకర్ (జైబోలో తెలంగాణ)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాశ్ రాజ్(దూకుడు)
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ (రాజన్న)
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్.ఎస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ హాస్య నటి : రత్నసాగర్ (కారాలు-మిర్యాలు)
ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ బాల నటుడు : మాస్టర్ నిఖిల్ (100 పర్సెంట్ లవ్)
ఉత్తమ బాల నటి : బేబీ ఆన్వీ (రాజన్న)
ఉత్తమ స్కీన్‌ప్లే రచయిత : శ్రీనూవైట్ల (దూకుడు)
ఉత్తమ డైలాగ్ రైటర్ : నీలకంఠ (విరోధి)
ఉత్తమ లిరిక్ రైటర్ : మథుపల్లి సురేంధర్ ( రాతి బొమ్మలోన కొలువైన శివుడు - పోరు తెలంగాణ)
ఉత్తమ సినిమాటోగ్రఫి : పీఆర్‌కే రాజు (శ్రీరామరాజ్యం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజ (శ్రీరామరాజ్యం)
ఉత్తమ ప్లేబాక్ గాయకుడు : గద్దర్ (పొడుస్తున్న పొద్దుమీద - జై బోలో తెలంగాణ)
ఉత్తమ ప్లేబాక్ గాయని : మాళవిక ( అమ్మా అవని - రాజన్న)
ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ ( దూకుడు )
ఉత్తమ ఆర్ట్ డిజైనర్ : రవీందర్
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శ్రీను (జగదానందతారక - శ్రీరామరాజ్యం)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ - దేవి కృష్ (బద్రీనాథ్)
ఉత్తమ కాస్టూమ్ డైరెక్టర్ - నిఖిల్ దాన్, భాషా (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - రాంబాబు ( శ్రీరామరాజ్యం)
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - ఆర్‌సీఎమ్ రాజు ( పోరు తెలంగాణ)
ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - సునీత ( శ్రీరామరాజ్యం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ మేల్ - నాగార్జున (రాజన్న)
స్పెషల్ జ్యూరీ అవార్ట్ ఫీమేల్ -చార్మి ( మంధర)
స్పెషల్ జూరీ అవార్ట్ - రమేష్ (ఋషి)

Friday, October 12, 2012

ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉంది...అనిల్ కుంబ్లే

 ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సరికొత్త సవాల్‌ను తాను సమర్థవంతంగా నిభాయించగలనన్న నమ్మకం ఉందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన క్లైవ్ లాయిడ్ బాటలోనే ముందుకు సాగుతానన్నారు. క్రికెట్‌లో మరింతగా పాదర్శకతను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు సంత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్న కుంబ్లే ఐసీసీ ఈ ఏడాది నిర్వహించే రెండో సభకు వచ్చే నెల హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుంబ్లేను ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌తో పాటు పలువురు అభినందించారు.

ఏపీ విభజన సాధ్యం కాదు...గులాం నబీ ఆజాద్‌

 తెలంగాణ అంశాన్ని తేల్చడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీలను విభజించినట్లుగా ఏపీ విభజన సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ అంశంపై రెండేళ్లుగా వివిధస్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆజాద్ తెలిపారు. కేసీఆర్‌తోనూ సంప్రదింపులు జరిపామని ఆజాద్‌ ధృవీకరించారు. అయితే తెలంగాణపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని.. ఆ తర్వాతే కేంద్ర ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆజాద్ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

Thursday, October 11, 2012

ఏ హొదాతో పాదయాత్రకు వెళతారు: శోభ


దోచుకోవడానికి రాష్ట్రంలో ఇంకా ఏమి మిగిలందని షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళధ్యక్షురాలు శోభాహైమవతి ప్రశ్నించారు.2003 లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు,భూములు,సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే వాటిని దోచేశారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు కలిసి రూ.లక్ష కోట్లు ప్రజా సొత్తును భోన్చేశారన్నారు.షర్మిల ఏ హొదాతో పాదయాత్ర చేపడతారని,ఏ హొదాలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. పిల్ల కాంగ్రెస్ లో షర్మిల పదవి ఏంటని ప్రశ్నించారు.

జగన్ లైఫ్‌పై సినిమా

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందట. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 1990లలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రాన్ని రీమేక్ చేయాలని విష్ణు భావిస్తున్నారు. చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పటికీ వైయస్ జగన్ ఆధారంగా చిత్రం ఉండేలా చూస్తున్నారట. జగన్ తన అరెస్టుకు ముందు మోహన్ బాబు ఇంటికి భార్య భారతితో సహా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతును జగన్ కోరారు. అయితే జగన్ ఇంటికి రావడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని, తన తనయుడికి కవలలు పుట్టినందువల్లే చూసేందుకు వచ్చారని మోహన్ బాబు చెప్పారు. కానీ రాజకీయ ప్రాధాన్యత ఆ భేటీలో ఉందనేది పలువురి వాదన. ఆ తర్వాత జైలులో కూడా ఓసారి తనయుడితో వెళ్లి కలిశారు.

జగన్ సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం సాయంత్రం స్పష్టం చేశారు. 'మరో ప్రస్థానం' పేరుతో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని విజయమ్మ వెల్లడించారు. సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో, ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా వైఎస్ స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. 

Wednesday, October 10, 2012

జగన్ పార్టీలోకి మోహన్ బాబు !


కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన చర్యలను చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కొద్ది నెలలుగా ఆయన తాను తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెబుతూ వచ్చారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడగానే తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తన గురువు దాసరి నారాయణ రావుకు ప్రాధాన్యత కల్పించడం, చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన నేపథ్యంలో మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసులో చేరే అవకాశాలు లేవని తొలి నుండి అందరూ భావించిన విషయమే.
తన విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చాలాకాలం తర్వాత ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టిడిపిలో చేరేందుకు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు చంద్రబాబుకు తనకు మధ్య చిన్న మనస్పర్థలు మాత్రమేనని, ఆయన పాలన బావుందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా అవినీతిలేని పార్టీలో చేరతానని, జర్నలిస్టులు ఏదో సూచించాలని కోరారు. అప్పటికే జగన్ పార్టీకి అవినీతి మచ్చ పడ్డ నేపథ్యంలో మోహన్ బాబు ఖచ్చితంగా టిడిపిలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా మోహన్ బాబు ఇంటికి జగన్ రావడం, ఆ తర్వాత ఓసారి జైలులో కూడా తన తనయుడు విష్ణుతో కలిసి మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలవడం మరోసారి చర్చకు దారితీశాయి. అప్పుడు జగన్‌కు అనుకూలంగా మాట్లాడారు. రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయటకు వస్తాడని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. దీంతో మోహన్ బాబు టిడిపిపై యూ టర్న్ తీసుకున్నట్లుగా అర్థమైపోయింది. తాజాగా మోహన్ బాబు తనయుడు విష్ణు హీరోగా వస్తున్న ఓ చిత్రం జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Monday, October 8, 2012

16 ఏళ్ల రాగానే పెళ్లి చేయండి!


 ఇటీవల హర్యానాలో రేప్ కేసుల సంఖ్య పెరగడంతో దానికి అక్కడి కాప్ పంచాయత్ పెద్దలు వింత పరిష్కారం చూపారు. యువతీయువకుల పెళ్లి వయస్సు తగ్గించి, వారికి 16 ఏళ్లకే పెళ్లి చేయాలని అప్పుడే అత్యాచార కేసులు తగ్గుముఖం పడతాయంటూ కొత్తభాష్యం చెప్పారు. అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కొద్దిరోజులక్రితం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెలరోజుల్లో ఇలాంటివి 12 సంఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వానికి తలంటింది.
మరోవైపు ఈ ఘటనల వెనుక కుట్ర దాగుందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాప్ పెద్దలు తమదైన శైలిలో పరిష్కార మార్గం చెప్పారు. ‘‘16 ఏళ్లు రాగానే యువతీయువకులకు పెళ్లి చేస్తే.. వారు తప్పుదోవపట్టరు. తద్వారా రేప్ కేసులూ తగ్గుముఖం పడతాయి’’ అని ఓ కాప్ పెద్ద పేర్కొనగా.. రజస్వల కాగానే ఆడపిల్లకు పెళ్లి చేయాలని మరో పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు వరుస సంఘటన లపై హర్యానా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేసింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని ప్రకటించింది. అయితే సర్కారు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Sunday, October 7, 2012

తిరుమలలో శ్రీవారి లడ్డూల కొరత

 తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.

Saturday, October 6, 2012

పాదయాత్ర లో చంద్రబాబు వెంట పరిటాల శ్రీరామ్

టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీ కోసం కార్యక్రమంలో భాగం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఐదో రోజు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు.

Friday, October 5, 2012

జనం చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్...ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్


 'వస్తున్నా . . . మీకోసం' పాదయాత్రలో చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అనంతపురం జిల్లా ఉరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రొద్దం మండలం రాగిమేకలపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారని తెలిసిందన్నారు. ఆయన సుదీర్ఘ యాత్రకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చడానికి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయనను స్వాగతించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ద్వారా చంద్రబాబు యాత్రను అడ్డగించి ఇబ్బంది కలిగించేలా మంత్రి, ఎంపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

2013లో రిటైర్మెంట్ ప్లాన్ ...సచిన్ టెండూల్కర్

 తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పాడు. నవంబర్‌లో భవిష్యత్తుపై సమీక్షించుకుంటానని ఆయన అన్నారు. ఓ టెలివిజన్ చానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. "ఇప్పుడు నాకు 39 ఏళ్లు. ఇంకా చాలా క్రికెట్ ఆడుతానని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. రిటైర్మైంట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగితే అవునని, ఆ విషయం ఆలోచిస్తున్నానని జవాబిచ్చారు. ఇప్పుడు తనకు 39 ఏళ్ల వయస్సు అని, దాని గురించి ఆలోచించడం అసాధారణమేమీ కాదని, తాను తన హృదయం చెప్పిన మాటే వింటానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు చెబుతోందని, సిరీస్‌కు, సిరీస్‌కు మధ్య ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తాను ఆడుతానని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాను రిటైర్ కావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్‌లో ఆడిన తర్వాత తిరిగి సమీక్షించుకుని అంచనా వేసుకుంటానని అన్నారు.

జగన్ బెయిల్ పై డెడ్‌లైన్

జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

జగన్‌ సుప్రీం కోర్టులో నో బెయిల్

 అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబాలన్, రంజనా దేశాయ్ తో కూడిన డివిజన్ బెంజ్ తిరస్కరించింది. దర్యాప్తు ముగిసేలోపు మళ్లీ బెయిల్ అడగవద్దని కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీగా వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. సాక్షులను ఏవిధంగాను ప్రభావితం చేయలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, ఇంకా వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు జగన్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 

Thursday, October 4, 2012

జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు


వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రేమికులపై దాడి

విహారానికి వచ్చిన ప్రేమికులపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా టైగల్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన అజిత, మునిరాజులుగా గుర్తించారు.

రాయలసీమ అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఇవ్వండి...మంత్రి టీజీ వెంకటేష్

రాయలసీమ అన్ని వనరులకు నిలయం అని, కాని వాస్తవానికి మాత్రం అల్లుని నోట్లో శని అన్నట్టు రాయలసీమలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంత్రి టి.జి. వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవితో మంత్రి టీజీ వెంకటేష్ బృందం గురువారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మంత్రి టీజీ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అన్నివిధాల వెనుకబడి ఉందని సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వాయలార్‌ను కోరినట్లు తెలిపారు. రాయవసీమలో బంగారు గనులకు కొదవ లేదని, అలాగే వజ్రాలకు పెట్టింది పేరు అని, ఎన్నో వనరులు ఉన్నా ఫలితం మాత్రం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై సుప్రీంలో రేపు విచారణ

శుక్రవారం జగన్ బెయిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జగన్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇంతవరకు సీబీఐ, ఈడీలు చేసిన విచారణ వృధా అవుతుందని భావిస్తూ ఈడీ ఈరోజు అన్నీ ఆధారాలతో జగన్ అండ్ కో స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదించే వాదనలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝలిపించింది. జగన్మోహన్‌రెడ్డి ఆయన ద్వారా లబ్ది పొందిన వారి స్థిర చరాస్తులను ఈడీ గురువారం జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనగా ఈడీ నిర్ధారిస్తూ, రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ. 14 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి ప్రభుత్వం ద్వారా (అక్రమార్గంలో) పలు విధాలుగా అంటే సెజ్‌లు, ఇరిగేషన్, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గనుల కేటాయింపులు తదితర వాటి ద్వారా లభ్ది పొందిన కంపెనీలు, జగన్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారించి, ఈ నేపథ్యంలోనే వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. హెటోరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, మూడు కోట్ల రూపాయల పిక్సిడ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆరబిందో ఫార్మాకు సంబంధించి 95 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలు రూ.8.60 కోట్లు లబ్ధి పొందేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈడీ నిర్దారించింది. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమిని కేటాయించిందని పేర్కొంది. మరో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ 30.33 ఎకరాల భూమిని పొందడం ద్వారా రూ.4.30 కోట్లు లబ్ధి పొందిందని వివరించింది. భూముల కేటాయింపులో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అడ్డదారిలో భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. తదుపరి చర్యలకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది.

Wednesday, October 3, 2012

పవన్ కళ్యాణ్ సినిమా తో చేసే తీరిక లేదన్న... సమంత

కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సమంత ఖండించింది. ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. ‘గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది. ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

పార్టీలోకి రావడానికి పర్మిషన్ అవసరంలేదు...నారా లోకేష్

పార్టీలోకి రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం అన్నారు. తండ్రి పాదయాత్రలో పాలుపంచుకుంటున్న లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్నారు. తాను 1995 నుండే పార్టీ కోసం పని చేస్తున్నానని, 1999 నుండి క్రియాశీలకంగా ఉన్నానని, పార్టీలోకి వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి చూస్తున్నారన్నారు. రాజకీయాలలోకి రావడం గొప్ప విషయమేమీ కాదన్నారు. కుప్పం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి లోకేష్... కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. ఇకపై పార్టీ పటిష్టతపై సీరియస్‌గా దృష్టి సారిస్తానని లోకేష్ చెప్పారు. పాదయాత్రకు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.

కేసీఆర్ పై హైకోర్టు విచారణ

ప్రభుత్వం కేటాయించిన భూమిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నరని ఆయన మేనల్లుడు ఉమేష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉమేష్ రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నుండి తీసుకున్న భూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంతో ప్రైవేటు న్యూస్ ఛానల్ ను నడపడంపై ఉమేష్ రావు గతంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్ల గదుల వద్ద అమ్మాయిల అరెస్ట్!

వెస్టిండీస్ క్రికెటర్ల గదుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు బ్రిటన్ జాతీయ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లోని విండీస్ క్రికెటర్ల గదుల్లోకి అనధికారికంగా వెల్లడానికి ప్రయత్నించడంతో మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సిన్నమోన్ గార్డెన్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ట మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకుంది.

తెలంగాణపై ఇప్పట్లో రాదు...మంత్రి టీజీ

 ప్రత్యేక తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశంలేదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికలకు ఆరె నెలల ముందు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడనుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని మంత్రి టీజీ తెలిపారు.

తప్పులు సరిదిద్దుకుని మంచి పాలన అందిస్తా...చంద్రబాబు

తొలిరోజు పాదయాత్రలో జననీరాజనాలు అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజైన బుధవారం కోళ్లకుంటనుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు దాదాపు 18 కి.మీ వరకు పాదయాత్ర సాగనుంది. 8 నుంచి 10 గ్రామాల్లో బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. రెండో రోజు ప్రాదయాత్రలో కూడా బాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ నాయుడు ఉన్నారు. బుధావారం ఉదయం హిందూపురం నియోజకవర్గం కోళ్లకుంట నుంచి బాబు పాదయాత్రను ప్రార ంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ టీడీపీ హయాంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్గుకొని మంచి పాలన అందిస్తానని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశామన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగాలనే తాను ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం జరగాలన్నారు. కానీ కాంగ్రెసు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, దానిని విదేశాలలో దాచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైనా 14 శాతం పన్ను విధించిందని విమర్శించారు.

Monday, October 1, 2012

'గుండెల్లో గోదారి' ఫొటోఫై చర్యలు తీసుకుంటాం... మంచు లక్ష్మీప్రసన్న


 మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ నటించిన డబుల్స్ అనే చిత్రాన్ని తమిళంలో ‘పుదువై మనగరమ్' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘గుండెల్లో గోదారి'లోని తాప్సీ ఫొటోలను వినియోగిస్తున్నారని, ఇది అభ్యంతరకరమని లక్ష్మీ చెబుతూ, ఈ విషయాన్ని తమిళనాడు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ సినిమా ప్రచారం కోసం 'గుండెల్లో గోదారి'లోని తాప్సి ఫొటోలను వాడుకుంటున్నారు. ''ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము'' అన్నారు లక్ష్మీ ప్రసన్న.గుండెల్లో గోదారి ఓ సాహసోపేతమైన ప్రేమకథ. వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకొన్నాము. 1980 కాలంలో నడిచే కథ ఇది. ఇళయరాజా ఆరు బాణీలను అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 'సినిమా విడుదలైన తరవాతే ఇవ్వు' అన్నారు. ఆ మాట ఎంతో సంతోషాన్నిచ్చింది' 'అని ఆమె చెప్పారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పాటల్ని, నవంబరు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తారు.

బాబు యాత్ర ఎందుకో తెలియదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తనకు తెలియదని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి పెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు పా దయాత్రపై మీ స్పందన ఏమిటంటూ విలేఖరులు అడగటంతో పైవిధంగా స్పందించారు.

చంద్రబాబుకు కలిసిరాని కాలం!


 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు. చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు. పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.