http://apvarthalu.com/

Tuesday, November 13, 2012

రాష్ట్రంలో రెచ్చిపోతున్న హిజ్రాలు

                                           
రాష్ట్రంలో పలు చోట్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కేవలం యాచకులుగా భావించి ప్రజలు, పోలీసులు వారిని అలా వదిలివేయడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లింగపరమైన సమస్య తప్ప వారికి ఏ లోపం ఉండదు. కొందరు లింగమార్పిడి చేసుకున్నవారు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో లింగమార్పిడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వారు అన్ని రకాల పనులు చేయగలరు. చేస్తారు కూడా. ఏ పని చేయడానికైనా వారి శరీరం అనువుగానే ఉంటుంది. కానీ వారిలో ఎక్కువ మంది పనిపాట లేకుండా చప్పట్లు కొడుతూ యాచనకు అలవాటుపడిపోయారు. ఏ పని చేయకుండా కాలం గడిచిపోతుండటంతో వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. లింగ మార్పిడి చేసుకున్న కొందరు వ్యభిచారానికి అలవాటు పడితే, మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాలలో వారు తమ వికృత చేష్టలతో యువతీయువకులను, బాలురను వేధిస్తున్నారు. ముఖ్యంగా వారు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, బైపాస్ రోడ్లలో ఎక్కవగా ఉంటారు. రైళ్లలో వారి ఆగడాలకు హద్దులు లేవు. రైల్వే పోలీసులు చూసిచూడనట్లు వదిలివేయడంతో వారు రెచ్చిపోతున్నారు. రైళ్లలో చప్పట్లు చరుస్తూ వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడతారు. వారు అడిగినంత ఇవ్వాలి. ఇవ్వకపోతే హింసే. కుర్రవాళ్లని నానారకాలుగా ఇబ్బందిపెడతారు. వారిమీదకు ఎగబడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని దోచేస్తారు. వారికి ఎదురు తిరిగి నిలబడటం కష్టం. మహిళలను కూడా వేధిస్తారు. వికృత చేష్టలతో హింసిస్తారు. కొన్ని సందర్భాలలో వారి చేష్టల వల్ల ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. బైపాస్ రోడ్లలో రాత్రి అవ్వగానే మొదలుపెట్టి, తెల్లవారుజాము వరకు అక్రమవసూళ్లు కొనసాగిస్తారు. వాహనదారులను వేధిస్తారు. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారు. 

హైదరాబాద్‌లో 12.12.12న 'చూమంతర్'

వచ్చే నెల 12వ తేదీన 12.12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సదస్సు 'చూ మంతర్'కు బ్రోచర్‌ను సోమవారం నాడిక్కడ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సదస్సు కన్వీనర్ సామల వేణు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

Sunday, November 11, 2012

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్!

హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చార్మినార్ ప్రాంగణంలోనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా ఇటు మతపరమైన, అటు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. పాతబస్తీలోని చార్మినార్ కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయ మరమ్మతులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీపావళి పండుగ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయ షెడ్‌ను ఈ నెల 1న తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. అది చూసిన మరో వర్గం ప్రజలు ఆలయాన్ని విస్తరిస్తున్నారని అపార్ధం చేసుకున్నారు. పనులకు అడ్డుతగిలారు. ఆ తరువాత ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ఆందోళనకు దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తరువాత దేవాలయ నిర్వాహకురాలి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు లోబడి ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పాతబస్తీ భగ్గుమంది. 

చిక్కుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా, మూలుగుతూ ముక్కుతూ నడుస్తున్న కిరణ్ ప్రభుత్వంపై పాతబస్తీ గ్యాంగ్ లీడర్ ఒవైసీ విరుచుకుపడ్డాడు. తమ పార్టీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నాడు. సరాసరి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని తన అస్త్రాన్ని సంధించాడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చార్మినార్ ను అనుకుని ఉన్న భాగ్య లక్ష్మీ ఆలయం విషయంలో మజ్లిస్ పార్టీ నాయకులు అతి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మజ్లిస్ పార్టీ మండిపడుతోంది. తమ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఏమిటని వారు వాదిస్తన్నారు. వివాదాన్ని ఎవరు రాజేశారు అనేది పాయింటుకాదు కానీ, ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి మీద పడుతుండటం విషయం. ఒవైసీలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఢిల్లీ జుమా మసీద్ ఇమామ్ స్థాయిలో ఒవైసీలను ట్రీట్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఒవైసీ మద్దతు ఉపసంహరించుకుంటాను అంటే వారు ఉలిక్కిపడతారు. ముస్లింలంతా తమకు దూరం అయిపోయారని బాధపడతారు. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి కిరణ్ కు మొటిక్కాయలు తప్పకపోవచ్చు. సన్నిహితులను దూరం చేస్తున్నావని కిరణ్ పై కేంద్రం మండిపడ వచ్చు.మొత్తానికి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని  అసదుద్దీన్ ఒవైసీ అంటున్నాడు. సోమవార ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని ఆయన అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై  మధ్యాహ్నానికి ఒక  ప్రకటన చేస్తామని ఆయన వివరించాడు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో ఇకపై! మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ వేడి రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 9లోపు తేల్చాలని డెడ్ లైన్ కూడా విధించారు. లేకుంటే వారు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది నిజమేనన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు బానిసలవుతారని తాను అనుకోవడంలేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. చివరిసారిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు నిర్ణయించుకున్నారు. ఆ లేఖలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, అందులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, తమ బాధని, ఆవేదనని వివరించాలని అనుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సమయం అని వారు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ తప్ప తమకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరంలేదని వారు తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారా? లేదా? అనేది తమ నేత సోనియాకు రాసే లేఖలో పేర్కొననున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామనడం రాజకీయంగా గొప్ప త్యాగంగా ఆయన వర్ణించారు. 

ఓరుగల్లు రామప్ప చరిత్ర


ఓరుగల్లు రామప్పదేవాలయ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవుని పాత్రను సుమన్ పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు చక్రి ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు.
కుమార్ మారబోయిన నిర్మాత. రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.
రామప్ప పాత్ర పోషిస్తున్న కాశీనాథ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు.

Wednesday, November 7, 2012

ఇక నుంచి తెలుగు అక్షరాలే కన్పించాలి


రాష్ట్రంలో ఇక ఎక్కడైనా తెలుగు అక్షరాలే కనిపించాలని అలా కన్పించకపోతే జరిమానా తప్పదని అధికార తెలుగు భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. రాజధానిలో ఉన్న లక్షలాది వ్యాపార దుకాణాలపై నామకరణాలు ఇంగ్లీష్‌లో ఉండడం క్షమార్హం కాదని ఆయన అన్నారు. తెలుగు మహాసభలు జరిగే సమయానికి రాష్ట్రంలో ప్రతి చోటా తెలుగు అక్షరాలు కన్పించాలని ఆశిస్తున్నామని అన్నారు. తిరుపతిలో జరగనున్న తెలుగు మహాసభలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార దుకాణాల నామఫలకాలు తెలుగులో స్పష్టంగా కన్పించే విధంగా ఉండాలని బుద్ధ ప్రసాద్ సూచించారు. 1966లో తెలుగు భాషను చట్టంగా రూపొందిచుకున్నామని అందుచేత తెలుగును భావనా భాషగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రథమ భాషగా తెలుగు, ద్వితీయ భాషగా ఉర్దూ, తృతీయ భాషగా ఇంగ్లీషును వాడాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక అంశాలను అందిపుచ్చుకున్న నేటి తరంలో తెలుగుకు ఉపకరణాలు తీసుకురావడం జరిగిందన్నారు. వీటికి కీ బోర్డు కూడా తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెలుగులో పదాలు కంపోజింగ్ చేసే సమయంలో తప్పులు దొర్లినప్పుడు వెంటనే సరైన పదాలు వచ్చే విధంగా నిఘంటువును తయారు చేశామన్నారు. త్వరలో అన్ని శాఖలకు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో తెలుగుభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే కడప యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో ఉపకులపతి రామచంద్రారెడ్డి తెలుగులో ప్రసంగం చేయడం తొలి విజయంగా ఆయన చెప్పారు. తెలుగు మహాసభలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు మహాసభల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆయ అన్నారు. తెలుగుభాషకు ఔన్నత్యాన్ని చేకూర్చేందుకు అధికార తెలుగు భాషా సంఘం తొలి సమావేశం సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేశామన్నారు.

కేసులు పెట్టాల్సింది పోలీసులపైనే


విద్యుత్ ఉద్యమంలో భాగంగా జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో కేసులు పెట్టాల్సింది తమపై కాదని, ఆ రోజు ముగ్గురు మరణానికి బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించాలని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన సిపిఐ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చేసినట్టు చెబుతున్నారని అలాంటి అవసరం ఆనాడు కమ్యూనిస్టులకు లేదని, దానికి కుట్ర చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. 9 వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా నిరాహారదీక్షలు చేశారని, ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చినపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఇపుడు ఉద్యమకారులే తుపాకీ లాక్కుని కాల్పులు జరిపారనే రీతిలో పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. నిజానికి అసెంబ్లీ వరకూ జరిగిన ర్యాలీలో సిపిఎం నేతలు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
ఆనాడు హోం మంత్రిగా జానారెడ్డి ఉన్నపుడు కేసులు అన్నింటినీ ఉపసంహరించినట్టు చెప్పారని, పోలీసు కాల్పుల్లో మరణించిన ముగ్గురి స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే దానిని ముఖ్యమంత్రే స్వయంగా ఆవిష్కరించిన విషయాన్ని సుధాకర్‌రెడ్డి గుర్తుచేశారు.