Monday, January 21, 2013
తెలంగాణ లేఖ వెనక నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడుకు మూడు రోజుల క్రితం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల హైదరాబాదు విషయమై ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని, ఆ ప్రతిపాదన పైన పార్టీలో చర్చించాలని బాబుకు సుధీష్ సూచించారు. అంబేద్కర్ సూచనను పరిగణలోకి తీసుకుంటే బావుంటుందన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంత సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా టిడిపి అభిప్రాయం చెప్పడంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి బాబును టార్గెట్గా చేసుకోవడం మానలేదు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు బాబు వల్లే సమైక్యవాదం మైనార్టీలో పడిందని మండిపడుతున్నారు. సీమాంధ్ర నేతలు బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. అవసరమైతే సమైక్యాంధ్ర నినాదంతో బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో సుధీష్ హైదరాబాద్ అంశాన్ని పార్టీలో తెరపైకి తీసుకు వచ్చారు. ఇది పార్టీలో మరింత చర్చకు దారి తీస్తోంది. సుధీష్ అభిప్రాయంతో పార్టీలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారట. తెలంగాణకు అనుకూలంగా టిడిపి ఉందని ప్రజల్లోకి వెళుతున్న సమయంలో సుధీష్ ఇలా చేయడాన్ని తెలంగాణ టిడిపి నేతలు జీర్ణించుకోవడం లేదట. సుధీష్ లేఖ పైన తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన లేఖ వెనుక ట్విట్టర్ బాయ్ నారా లోకేష్ ఉన్నాడని ఆరోపించింది.
ఎంపీ లగడపాటిది డ్రామా...హరీశ్రావు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రను కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్
అడ్డుకుంటాననడం డ్రామా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలను మోసగించటానికి వారిద్దరూ కూడబలుక్కొని నాటకమాడుతున్నారని
సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
పోలీసులు అదుపులోకి హైదరాబాద్ నగరం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు
రేపు సంగారెడ్డి బంద్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్ పి అదనపు
పోలీసు బలగాలను పిలిపించారు.బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్
చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా
షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి
చేశారు.red more
Sunday, January 20, 2013
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు...కోదండరామ్
సీమాంధ్ర నేతలు పెత్తనాన్ని కొనసాగించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి తెలంగాణ రాకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది కేంద్ర అధిష్టానానికి, కాంగ్రెస్ కు పరీక్షా కాలమని కోదండరామ్ అన్నారు. ప్రలోభాలకు లొంగుతారో, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం న్యాయసమ్మతంగా ఉంటే పోలీసు బలగాల అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే భారీ ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
గండి బాబ్జీకి వివి వినాయక్ సారీ చెప్పారు
మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీకి నాయక్ చిత్రం దర్శకుడు వివి వినాయక్ ఆదివారం క్షమాపణలు చెప్పారు. గండి బాబ్జీతో తనకు ఇది వరకు ఎలాంటి పరిచయం లేదని, అతనిని కించపర్చాలని చిత్రంలో ఆయన పేరు పెట్టలేదని, ఆయనతో టచ్ కూడా లేదని, ప్రతి నాయకుడి పాత్రధారికి కాకతాళీయంగానే ఆ పేరు పెట్టామని, ఇందుకు ఆయన బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.
Subscribe to:
Posts (Atom)