http://apvarthalu.com/

Saturday, September 29, 2012

హైదరాబాద్ గణనాథునికి ఘన వీడ్కోలు

 హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తజనం నామస్మరణ. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా.. భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది. రాత్రి 11 గంటల సమయానికి 4,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12-1 మధ్య మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది.

దేశంలో పెరిగిపోయిన అవినీతి

దేశంలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ కళ్యాణమండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సహకార దినోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. జీడీసీసీబీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో ఎక్కువ మందికి సహకార రంగంతో ప్రమేయం ఉందన్నారు. ఈ రంగం పటిష్టంగా ఉంటే పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకార వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

Thursday, September 27, 2012

వస్తున్నా మీకోసం: బాబు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు


అక్టోబర్ 2వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ఖరారైంది. అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు నిర్వహించే ఈ పాదయాత్రకు వస్తున్నా మీకోసం అనే పేరును పెట్టారు. హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉంద్నారు.
చంద్రబాబు అంతకుముందు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి లేదా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి పాదయాత్ర చేపట్టాలని చూశారు. కొడంగల్ నుండి దాదాపు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో అది కూడా రద్దయింది. ఈరోజు అధికారికంగా హిందూపురం నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందించారు. అన్నా స్టూడియోలో రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బాబు మార్చింగ్ పైన, బాబు వస్తున్నాడని ఇలా అర్థం వచ్చేట్టు పాటలను రాశారు.



బాబు లేఖ పెద్ద డ్రామా... గంటా

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ పెద్ద డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్ త్రవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. విశాఖలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో 144 సెక్షన్

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

ఓయూలో టెన్షన్...టెన్షన్

 ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా గురువారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు ఓయూ విద్యార్థి జేఏసీ ర్యాలీ ప్రారంభించారు. అయితే భారీగా పోలీసులు బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకుని బయటకు రాకుండా ఎన్‌సీసీ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి తెలంగాణ విద్యార్థుల ఆందోళనతో గురువారం అట్టుడికింది. సచివాలయ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. తాము జలదృశ్యం వరకు వెళ్లి ఇటీవల మరణించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

రాహుల్‌కు మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తా...ప్రధాని

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రివర్గంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు తన ఆహ్వానం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వంలో చేరాలని ఇప్పటికే పలుమార్లు ఆయన్ను కోరానని శనివారమిక్కడి రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో అన్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పెద్దపాత్ర పోషించేం దుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ వం టి నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతూనే.. కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతిని కాంగ్రెస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవాలని వారు కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆశిస్తున్నారు.